నిజామాబాద్, జులై 3
నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ సీజన్ లో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జరిగిన సమీక్షలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని లక్ష్య నిర్దేశం చేశారు.
నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపొందేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ ఈ సీజన్ లో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న ప్రీ-యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ ప్రాంతంలో గుర్తించిన స్థలం అనుకూలతపై చర్చించారు. భవిష్యత్తులో ఇదే ప్రాంతంలో రిఫైనరీ ఏర్పాటుకు సైతం స్థలం అందుబాటులో ఉండడం, పొరుగు జిల్లాలకు సెంటర్ పాయింట్ కావడంతో లక్కంపల్లి సెజ్ స్థలం ఫాక్టరీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అయితే ఆయిల్ పామ్ పంటను సేకరించే కలెక్షన్ సెంటర్లను రైతులకు అనువైన ప్రాంతాలలో అందుబాటులో ఉంచాలని ప్రీ-యునిక్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
ఎంతో లాభదాయకమైన ఆయిల్ పామ్ పంట సాగును చేపట్టి రైతులు ఆర్థిక అభ్యున్నతి సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా మాక్లూర్, డొంకేశ్వర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, సిరికొండ మండలాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఒక్కో మండలంలో కనీసం 100 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా చూడాలన్నారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులను కలుస్తూ, ఈ పంట వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలన్నారు.
పై మండలాలలోని రైతు వేదికలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుదీర్ఘ కాలం పాటు ఏటేటా సమకూరే రాబడి, అంతర పంటల సాగుకు గల అవకాశాలు తదితర అంశాలను వివరించాలని, ఆదర్శ రైతులు ఈ పంటను సాగు చేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చేలా అంకిత భావంతో కృషి చేయాలన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కోసం సరిపడా మొక్కలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఎంతోలాభదాయకమైనందున ఈ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున తోడ్పాటును అందిస్తోందని, ఈ అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ప్రీ యునిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయి కిరణ్, ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.











