యూరియా కొరత పేరుతో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న ఆందోళనలు రాజకీయ లబ్ధి కోసమేనని నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'యూరియా యాప్' ద్వారా ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దని ఆయన కోరారు.
మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహిపాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన ఎత్తిపోతల పథకాలు, గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఉమ్మడి మండలాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
భూభారతి కార్యక్రమం ద్వారా సదాబైనామా భూములకు పట్టాలు అందించి రైతులకు అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కృత్రిమ కొరతపై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని కాంగ్రెస్ నాయకులు సూచించారు.
అనవసర వదంతులను విశ్వసించి ఆందోళన చెందవద్దని, ఎరువుల కొరతపై తప్పుడు ప్రచారాలతో రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ మీసాల సుదర్శన్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎర్రం లింగం, సీనియర్ నాయకుడు పిప్పర సాయారెడ్డి, సర్పంచులు మీసాల లక్ష్మీనారాయణ, చిన్నయ్య, ఆర్మూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైండ్ల ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎడ్డిగారి నిఖిల్, పెంట ఇంద్రుడు, దమ్మాయి శ్రీను, కాంతం చిన్నయ్య, గాదె శ్రీను, మల్కా గంగారెడ్డి, నసీర్, మన్నె సాగర్ తదితరులు పాల్గొన్నారు.










